విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
టీడీపీ కార్యకర్తలు, నాయకులు బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కర్షక, కార్మిక, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఏనాడూ వెనుకంజ వేయదని, రాష్ట్రంలో మోటార్లకు మీటర్లను బిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అప్పుల కోసం రైతులను బలి చేస్తోందని, మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన వెల్లడించారు.
నూతన సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని, రైతుల బాధలను పాలకులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నారని, కేంద్రంపై పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేసుల భయంతో కేంద్రానికి వత్తాసు పలుకుతోందని ఆయన అన్నారు.
పార్లమెంట్ దగ్గరకు వెళ్లిన కార్మికులను వైసీపీ ఎంపీలు అవమానించారని, కార్మికుల చేతనే వారి బాధలు కేంద్ర పెద్దలకు వినిపిస్తామని ప్రగల్భాలు పలికి పార్లమెంటు దగ్గరకు వచ్చిన కార్మికులతో తమకు సంబంధం లేదని మాట్లాడటం సిగ్గుచేటుని అచ్చెన్నాయుడు అన్నారు.