పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ చేపట్టారు. రాష్ట్రంలో 46 మంది మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న దేవేందర్ మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కమిషనర్ గా, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న జెగ్జీవన్ ను సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు నూతన కమిషనర్లను మాత్రం నియమించలేదు. కామారెడ్డి మున్సిపాలిటీకి కమిషనర్ ఎవరు రానున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే కామారెడ్డి మున్సిపాలిటీ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గత కొద్దిరోజులుగా మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలు, అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న ఈ మున్సిపాలిటీకి కొత్త కమిషనర్ గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
సత్యం న్యూస్, కామారెడ్డి