సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఖరు నిమిషం వరకూ ఎందుకు వేచి చూసింది? ఈ విషయంపై విస్తృత చర్చ జరుగుతున్నది.
మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ అయినా సాయంత్రం వరకూ సీఐడి పోలీసులు వేచి చూశారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ కాగానే రఘురామకృష్ణంరాజును చికిత్స కోసం సికింద్రాబాద్ తరలించడానికి అడ్డంకులు ఏమిటనేది చర్చనీయాశం అయింది.
సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఎవరి ఆదేశాల కోసం సీఐడి పోలీసులు వేచి ఉన్నారనేది ప్రశ్నార్ధకం. రఘురామకృష్ణంరాజును తరలించడంలో జాప్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై ఆయన లాయర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణంరాజును వైద్యం కోసం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించే బాధ్యతను ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించింది. దాంతో రఘురామకృష్ణంరాజు సతీమణి రమాదేవి ఆయనకు ఫోన్ చేసి అడిగారు.
సుప్రీంకోర్టు తీర్పు సీఐడీకి వ్యతిరేకంగా రావడంతో సీఐడి ఆయనపై కక్ష పెంచుకునే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల జైలులో తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఎంతో ఆవేదనగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పారు.
తక్షణమే రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని రమాదేవి ఆయనను అభ్యర్ధించారు. ఆమె అభ్యర్ధనతో ఏం చేయాలో పాలుపోని ఏపీ సీఎస్ గంటలోనే ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపుతామని చెప్పారు. అప్పటి వరకూ జాప్యం జరగడానికి కారణం గా సుప్రీంకోర్టు ఆదేశాలపై అప్పీలుకు వెళ్లవచ్చా అనేది పరిశీలన చేయడమేనని అంటున్నారు.
స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయడం లాంటి వెసులుబాట్లు ఉన్నాయా అని న్యాయనిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారని అంటున్నారు. అయితే న్యాయ నిపుణులు ఏం సలహా ఇచ్చారో తెలియదు కానీ రఘురామకృష్ణంరాజును ఆఖరు నిమిషం వరకూ వేచి చూసిన తర్వాతే తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.