తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ లో ఆర్థిక లావాదేవీలు, మార్టిగేజ్ రుణాలు కచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలకు లోబడి జరిపించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా బ్యాంకు లో పేరుకుపోయిన మొండి బకాయిల వివరాలను ప్రస్తుత పాలకవర్గంతో పాటు గతంలో పనిచేసిన పాలకులు మీడియా ముఖంగా చేస్తున్న ప్రకటనలు ఖాతాదారులకు ఆందోళనలు కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.
తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు లోని లాకర్ డిపాజిట్లు భద్రమేనా అన్న అనుమానాలు ఖాతాదారులలో కలుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ మొండిబకాయలపై పత్రికల్లో వస్తున్నా “డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్” “డిస్టిక్ రిజిస్ట్రార్” ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ఆయన ప్రశ్నించారు. తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకులో ప్రతి సంవత్సరం జరగాల్సిన ఆర్థిక లావాదేవీల “ఆడిటింగ్” డిస్టిక్ రిజిస్ట్రార్ ద్వారా సక్రమంగా జరుగుతున్నాయా లేవా అన్న అనుమానాలు కలుగుతున్నాయని దీనికి డిస్టిక్ రిజిస్ట్రార్ సమాధానం చెప్పాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు.
తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ ఎందరో మహానుభావుల నిస్వార్ధ కృషితో కేవలం తిరుమల తిరుపతి రేణిగుంట చంద్రగిరి పరిసర ప్రాంత ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడ్డ అతిపెద్ద కోపరేటివ్ సెక్టార్ బ్యాంక్ అని ఆయన తెలిపారు. తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ పాలకవర్గం అంటే “పార్ట్ టైం జాబ్” లాంటిది ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలే తప్ప రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకూడదని ఆయన అన్నారు.