తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు కార్యకలాపాలు పారదర్శకంగా జరుగుతాయా? కచ్చితంగా జరుగుతున్నాయి. అందులో సందేహం లేదు. మరి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు కార్యకలాపాలకు సమాచార హక్కు చట్టం అమలు చేయకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారు?
ఇదే ప్రశ్నను పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశంలో సమాచార హక్కు చట్టం పరిధిలోకి దాదాపు అన్ని అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాలు వచ్చి ఉన్న ఈ కాలంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తున్నది.
టీటీడీ ఖర్చుచేసే ప్రతి పైసాను ప్రశ్నించే హక్కు శ్రీవారి భక్తులకు కల్పించాలని ఈ సందర్భంగా రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ భూముల అమ్మకాలు 1974 సంవత్సరం నుంచి జరిగాయని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.
ఏ ప్రభుత్వ హయాంలో భూములు అమ్మకాలు జరిగాయి? ఏ ప్రాంతంలో ఉన్న భూములను అమ్మేశారు? ఎంత విస్తీర్ణం అమ్మేశారు? ఎంత ధరకు అమ్మేశారు? టీటీడీ భూముల అమ్మకం ద్వారా వచ్చిన నిధులను ఎక్కడ డిపాజిట్ చేశారు? లాంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశిస్తున్నారు.
అందుకే సమాచార హక్కు చట్టం టీటీడీకి వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. దేవస్థానం కు సంబంధించిన వివరాలకు గోప్యత ఎందుకని ఆయన ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి నగలు,నగదు డిపాజిట్లు,స్థిర చర ఆస్తులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులలో కలుగుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలి పై ఉందని ఆయన అన్నారు.