పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తానన్నారని, ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారన్నారు. 2020, 2021, 2022 అంటూ గడువులు పెంచారని, ఇప్పుడు 2025కు పోలవరం పూర్తి చేస్తాం అంటున్నారని మండిపడ్డారు. 2025 నాటికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారా అని ఎద్దేవా చేశారు.
నిర్వాసితులను నీళ్లలో ముంచి ఈరోజు మాట మారుస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పోలవరం పూర్తి కాదని స్పష్టం చేశారు. 150 అడుగుల ఎత్తు ఉండాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు పాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచన చేయలేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలవరం ఎత్తు తగ్గించారని మండిపడ్డారు.
అమరావతిని ధ్వంసం చేసినట్లే పోలవరంను జగన్ నాశనం చేస్తున్నారని విమర్శించారు. 23న ఏలూరులో పోలవరంపై నిరసన చేపడతామని ప్రకటించారు. మెడికల్ కాలేజీ సీట్లలో ప్రభుత్వం నిర్ణయంతో ఎస్స్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లకే గండి కొడుతుంటే ప్రైవేటు కాలేజీల పరిస్థితి ఘోరమని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.