కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా అని ఎమ్మెల్యే జోగు రామన్న సవాల్ విసిరారు. పట్టపగలే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్రెడ్డికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు.
రేవంత్రెడ్డి మరోసారి అమర్యాదగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల తనను తన ఇంటి పేరుతో విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. బడుగు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కాబట్టే ఓర్వలేక అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో రేవంత్రెడ్డి, చంద్రబాబు కు నౌకర్గా వ్యవహరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధే పరమావధిగా ముందుకు దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడి నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు.
టీపీసీసీ అధ్యక్షుడికి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరో తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. తన ఇంటి పేరును వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.