విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గ సమన్వయ కర్త కే కే రాజు కి ప్రభుత్వం కేటాయించిన గన్ మేన్ ల సెక్యూరిటీ ని తక్షణమే ఉపసంహరించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ ని కలిసి ఆయన ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కే కే రాజు కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రమే నని, ఆయనకు ప్రాణహాని వుందని సెక్యూరిటీ తీసుకున్నారని తెలిపారు. అయితే గత నెల 27వ తేదీ న విశాఖ పర్యటన కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని అడ్డగించడంలో ఒక రౌడీ లా ప్రవర్తించిన వ్యక్తి కి సెక్యూరిటీ ఎందుకని బివి రామ్ ప్రశ్నించారు.
తక్షణమే కేకే రాజు సెక్యూరిటీ తొలగించక పోతే కేంద్ర హోంమంత్రి కి ఫిర్యాదు చేస్తానన్నారు. విశాఖ లో సామాన్య ప్రజలకు కూడా ప్రాణహాని వుందని అందరికీ పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీ న రాజధాని అనుకూలమా కాదా అనే అంశం పై సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఈవి షయమై కలెక్టర్ అనుమతి తీసుకోగా పోలీస్ కమీషనర్ ని కలవమన్నారని అన్నారు. అధికారులు అనుమతి ఇవ్వకపోతే తదుపరి న్యాయపరంగా అనుమతులు తీసుకుంటానన్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి సుచరిత,పర్యాటక శాఖ మంత్రి ముత్తెంశెట్టి శ్రీనివాస్ రావు ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.