సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలో సోమవారం జరిగిన మహిళా సమైక్య మండల కౌన్సిల్ సమావేశంలో భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా సృజన మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలలో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని, నేటికీ 25 సంవత్సరాలు పూర్తయినా పాలకపక్షానికి, ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. మహిళలు సమాజంలో సగం భాగం ఉన్నప్పటికీ వారి హక్కులకు భంగం కలిగించే విధంగా కేంద్రంలో,రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు,మంత్రులు మహిళలపై వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని,తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు మండల కేంద్రాలలో ప్రారంభోత్సవాలకు డోక్రా,సమభావన సంఘాల మహిళలను, నర్సులను,గ్రామ పంచాయతీ సిబ్బందిని మంత్రులకు స్వాగతం పలికేందుకు వారిని ఎండకు,వానలకు రోడ్ల వెంట నిలబెట్టి స్వాగతం పేరుతో మహిళలను అగౌరవపరచడం జరుగుతుందని, నాయకులు ఆడపడుచులకు ఇచ్చే గౌరవం ఇదేనా అన్నారు.ముఖ్యమంత్రి ఆడపడుచులు మా చెల్లెళ్ళు అంటారే వారికి అగౌరవం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఇదేనా బంగారు తెలంగాణ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశ పెట్టలేక కులాలు,మతాల పేరుతో దేశంలో ప్రశాంత వాతావరణం లేకుండా చేయటానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో ఒక భాగమేనని, చిత్తశుద్ధి ఉంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఇప్పటికైనా మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందుకు వెళ్తూ రాణిస్తుంటే సరియైన రక్షణ కొరవడిందని అన్నారు.
దేశంలో సగం భాగం కలిగిన మహిళలకు హక్కుల సాధన కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని, మహిళా హక్కుల సాధన కొరకు మహిళా బిల్లు కోసం భారత జాతీయ మహిళా సమాఖ్య ఈ దేశంలో సంవత్సరాల పోరాటం కలిగిన చరిత్ర ఉందని అన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళా బిల్లుపై సంతకం చేస్తానని చెప్పిన ప్రధానమంత్రి మోడీ ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం చిత్తశుద్దితో పార్లమెంటు సమావేశాల్లో వెంటనే మహిళా బిల్లుపై చర్చ జరిపి అమలు చేసే విధంగా చూడాలని,దేశంలో మహిళలకు అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించే విధంగా పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపరితల కోటమ్మ, పచ్చర్ల బాలమ్మ, కంచర్ల కోటేశ్వరమ్మ, తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్