మహిళలు తలచుకొంటే సాధించలేనిది ఏదీ లేదని, అన్ని రంగాలల్లో మహిళలు ముందుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సాదు నరసింహారెడ్డి అన్నారు. ఎంతో మంది మహిళలు సేవా రంగంలో అమ్మలవలె సేవలను అందిస్తున్నారని అన్నారు. హన్మకొండలోని మల్లికాంబ మనో వికాస కేంద్రం ప్రాంగణంలో అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలామ్ ఎక్సెలెన్సి సేవా అవార్డ్ ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డును అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా. కరుకాల అనితారెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ సేవారంగంలో మహిళలు మరింత ముందుకు రావాలని కోరారు. అనితారెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఇక ముందు కూడా అవసరార్థులకు, అనాథలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సేవలని అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆనంద్ దేవునూరి, శ్రీనివాస్, జమ్ముల వీరారెడ్డి, రామలీల, పరమేశ్వర్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు కుట్టుమిషన్లను పంచి పెట్టారు.
previous post