రక్షణ కల్పించాలని జగన్ కు రైతు నరేంద్ర వేడుకోలు
గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నుండి తనకు ప్రాణహాని ఉందని బెయిలుపై మంగళ వారం విడుదలైన రైతు నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆనాడు రాజశేఖరరెడ్డి ఈనాడు జగన్ నాయకత్వంలో వైసీపీ జెండా మోసిన కార్యకర్తగా నా పై దాడికి దిగిన ఎమ్మెల్యే బొల్లా పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనపై చెప్పుతో దాడి చేసి అనరాని మాటలు, బూతులు మాట్లాడి తన పైన కేసులు బనాయించారని అధికారం అడ్డం పెట్టుకొని నాలాంటి వారి పై కక్ష తీర్చుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బ్రహ్మనాయుడు ఆ పేరు పెట్టుకొని పల్నాడు బ్రహ్మనాయుడు పరువు తీస్తున్నాడని నరేందర అన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రజలు చూస్తూ ఉండగా నాపై చెప్పుతో దాడి చేసిన మాట వాస్తవం అని స్పష్టం చేశారు. బ్రహ్మ నాయుడు నమ్మే రామలింగేశ్వర స్వామి వద్దకు నా పిల్లలతో వస్తా ఆయన కూడా ఆయన పిల్లలను తీసుకొని రమ్మను ప్రమాణం చేద్దాం అని నరేంద్ర సవాల్ చేశారు. తాను ముఖ్యమంత్రి జగన్ ను తిట్టలేదని ఆయన అన్నారు. ఇలా రైతు నరేంద్ర సబ్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.