జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధించి శోధన ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది.
హతమైన ముగ్గురు స్థానిక ఉగ్రవాదుల్లో ఇద్దరిని గుర్తించినట్లు కాశ్మీర్ ఏడీజీపీ తెలిపారు. కాగా మూడో వ్యక్తిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. వారిలో ఒకరు కాశ్మీరీ పండిట్ పురాణ కృష్ణ భట్ హత్యలో పాల్గొన్న షోపియాన్కు చెందిన లతీఫ్ లోన్, మరొకరు నేపాల్కు చెందిన టిల్ బహదూర్ థాపా హత్యలో ప్రమేయం ఉన్న అనంతనాగ్ కు చెందిన ఉమర్ నజీర్ గా గుర్తించారు. వారి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాల బృందానికి రహస్య సమాచారం అందిందని చెప్పారు. దాంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇంతలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.