రాష్ట్రంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా 92.58 లక్షలతో విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్మించిన ప్రకాశం పంతులు మహిళా పార్కు ప్రారంభోత్సవం ఘట్టం అట్టహాసంగా జరిగింది. ఆధునిక వసతులు, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు తదితర సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన పార్కును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్, విజయనగరం కార్పొరేషన్ పాలక వర్గ ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు.
మహిళా పార్క్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియం నుంచి నిర్వహించిన ర్యాలీ విజయవంతంగా సాగింది. మంత్రి ఆర్.కె. రోజా, డిప్యూటీ స్పీకర్, జడ్పీ ఛైర్మన్, ఎంపీ ఇతర ప్రముఖులు ముందు నడవగా వేలాది మంది మహిళలు వెనుక ర్యాలీగా సాగారు. సాంస్కతిక వైభవాన్ని చాటుతూ నిర్వహించిన ప్రదర్శనలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ బృందాలు ప్రత్యేక వాయిద్యాలు, గరగ నృత్యాలు, థింసా నృత్యాలతో చూపరులను ఆనందింపజేశారు.కాగా నగరంలో ఆనంద గజపతి ఆడిటోరియం నుంచి ప్రారంభమైన ర్యాలీ సింహాచలం మేడ, కోట జంక్షన్, మూడు లాంతర్లు జంక్షన్, గంట స్తంభం కూడలి మీదుగా ప్రకాశం పంతులు మహిళా పార్క్ వరకు కోలాహలంగా సాగింది. అనంతరం అక్కడ రిబ్బన్ కత్తిరించి మంత్రి ఆర్.కె. రోజా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ, డిప్యూటీ స్పీకర్, జెడ్పీ ఛైర్మన్, ఎంపీలతో కలిసి పార్కును ప్రారంభించారు. అనంతరం ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, పిల్లల ఆట పరికరాలను, హోం థియేటర్లను పరిశీలించారు.
వివిధ ప్రాజెక్టుల రాకతో జిల్లా ఖ్యాతి మరింత పెరిగింది
పార్కు ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర సీఎం జగన్ ప్రత్యేక చొరవ, అభిమానం వల్ల విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, దీని వల్ల జిల్లా ఖ్యాతి మరింత పెరిగిందని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మెడికల్ కాలేజీ, గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇతర ప్రాజెక్టులు జిల్లాకు మణిహారంగా నిలుస్తాయని అన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని మంత్రి రోజ పేర్కొన్నారు.
అందరి సమన్వయంతో ముందుకెళ్తున్నాం
అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారుల సమన్వయంతో, సహకారాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పేర్కొన్నారు. విజయనగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో, గ్రామీణ పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన పనుల గురించి డిప్యూటీ స్పీకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, వరుదు కల్యాణి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎస్, నగర మేయర్ విజయలక్ష్మి, ఉప మేయర్లు శ్రావణి, రేవతి ఇతర ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో మహిళలు, యువతీ, యువకులు పాల్గొన్నారు.