దేశానికి అన్నం పెట్టే రైతన్నను చిన్న చూపు చూడకూడదని, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే రైతులతో మర్యాద పూర్వకంగా మాట్లాడండి,వారి సమస్యలు విని వెంటనే పరిష్కరించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.
(రెండో)శనివారం సెలవు దినం కావడంతో ములుగు జిల్లా అబ్బాఫూర్ గ్రామంలో నల్లా బుచ్చిరెడ్డి వసంత దంపతుల పత్తి చేనులో కూలీలతో కలిసి పత్తి(ఎరారు) తీశారు. పని చేసినందుకు గాను యజమాని ఆమెకు కూలీ డబ్బులు చెల్లించారు.
అనంతరం తస్లీమా మాట్లాడుతూ రైతుగా పుట్టడం గొప్పవరమని, మనకు అన్నం పెట్టడం కోసం ఎండనక, వాననక రేయింబవండ్లు శ్రమిస్తున్న రైతు కూలీలకు ఎక్కడికి వెళ్ళినా మర్యాద ఇవ్వాలని కోరారు.
రైతు ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పడానికి ప్రతి సెలవు దినాలలో కూలీ పని చేస్తున్నానని, తల్లి దండ్రులు ఆరుగాలం కష్టపడి పని చేస్తూ పోషిస్తున్నారని, యువతి యువకులు తల్లిదండ్రులకు పనిలో సహకరించాలని యువతి యువకులకు సందేశాన్ని ఇచ్చారు.