ముఖ్యమంత్రి అయిన రోజు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిద్ర పోయారో లేదో తెలియదు కానీ నేటి రాత్రి మాత్రం ఆయన ఎంతో సంతృప్తిగా నిద్ర పోయి ఉంటారు. దేవుడి స్క్రిప్టును మార్చి ఈ మధ్య ఆయనే స్క్రిప్టు రాసేసుకుంటున్నారు. అదే విధంగా విశాఖపట్నంలో తనను ఎక్కడైతే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదలకుండా కట్టేసి పడేశారో అదే స్థలంలో చంద్రబాబునాయుడికి అదే విధంగా చేసి పగ తీర్చుకున్నారు.
చంద్రబాబునాయుడిని విశాఖపట్నం విమానాశ్రయంలో కట్టడి చేయాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్న ప్లాన్ యధా ప్రకారం అమలు జరిగింది. చంద్రబాబునాయుడిని విమానం ఎక్కించి విజయవాడకు పంపిస్తారని అందరూ అనుకున్నారు కానీ పోలీసులు మాత్రం ఆయనను హైదరాబాద్ పంపించారు. బహుశ చంద్రబాబునాయుడే అడిగారేమో తెలియదు.
మొత్తానికి చంద్రబాబు మాత్రం విశాఖపట్నంలో కాలుమోపలేకపోయారు. చంద్రబాబునాయుడిని 29 గ్రామాలకు పరిమితం చేయాలనేది జగన్ స్క్రిప్టు. అయితే ఆయన 29 గ్రామాలను వదిలి విశాఖపట్నం వచ్చారు. దాంతో విశాఖపట్నంలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు.
2017 జనవరి 26న విశాఖపట్టణంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ క్యాండిల్ ర్యాలీ తలపెట్టింది. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయన బీచ్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అక్కడే అడ్డుకున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా జగన్, ఇతర వైసీపీ నేతలను అడ్డుకున్నట్లు పోలీసులు అప్పటిలో చెప్పారు. దాంతో జగన్, విజయసాయిరెడ్డి, వైబీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు ఎయిర్పోర్టులో రన్వే పైనే బైఠాయించారు. పోలీసులు జగన్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపించారు. అందుకనే ఇప్పుడు చంద్రబాబును హైదరాబాద్ కే పంపించారు.
సాధారణంగా తమిళనాడు రాజకీయాలలో జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు ఇలాగే జరిగేది. ఒకరు అధికారంలో ఉంటే మరొకరికి నిత్య సమరమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా జయలలిత, కరుణానిధి సమయంలోని తమిళనాడు స్థాయికి చేరడం అంటే ముందుకు వెళ్లినట్లో వెనక్కి వెళ్లినట్లో తెలియదు కానీ మొత్తానికి మాత్రం అలాగే జరుగుతోంది.