2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అధికారులతో చర్చించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అవలంభించాల్సిన ఆర్థిక విధానంపై లోతుగా చర్చించారు. బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ రంగాలకు ఎంత కేటాయింపులు జరపాలి?
ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి? స్వీయ ఆదాయం పెంచుకునే మార్గాలేమిటి? తదితర అంశాలపై కసరత్తు చేశారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రాస్, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ సలహాదారు జిఆర్ రెడ్డి, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.