ఖమ్మం సంకల్ప సభలో వై ఎస్ షర్మిల తెలంగాణ సిఎంను ఏకవచన సంబోధనతో చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సిఎంను పేరుతో విమర్శించిన షర్మిల టీఆర్ఎస్ పార్టీకి కొత్త సవాల్ విసిరారు. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపిస్తున్న వైఎస్ షర్మిల నేడు ఖమ్మం పట్టణంలో మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ సభ కావడంతో భారీ జనందోహం కనిపించింది.
షర్మిల ప్రసంగం ఆరంభంలో జనాలకు చేరువలో వేదిక దిగువన మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే అభిమానుల కోలాహలం ఎక్కువ కావడంతో ఆమె వేదిక పైనుంచి ప్రసంగించారు. షర్మిల ప్రసంగం ప్రారంభించకముందే సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి షర్మిల ముఖం వెలిగిపోయింది.
ఉద్యమాల గుమ్మం ఖమ్మం అంటూ ప్రసంగం ఆరంభించారు. పల్లెపల్లె నుంచి వచ్చిన వైఎస్సార్ అభిమానులకు, వేదికపై ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న ప్రతి అన్నకు, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు, ప్రతి తమ్ముడికి, వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ మీ రాజన్న బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోందని పేర్కొన్నారు.
సరిగ్గా 18 ఏళ్ల కిందట ఇదే ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వైఎస్సార్ చారిత్రాత్మక పాదయాత్ర ప్రారంభమైందని వివరించారు. ఇప్పుడు అదే ఏప్రిల్ 9న నేను రాజన్న బిడ్డగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తున్నానని ప్రకటించారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి పార్టీ అవసరమని షర్మిల ఉద్ఘాటించారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ ను పునఃప్రతిష్ట చేయబోతున్నాం అని వివరించారు.
ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతి
ప్రాజెక్టుల్లో కేసీఆర్ ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరమన్నారు. తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్ కలలు కన్నారని చెప్పారు. కేసీఆర్ చెప్పిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? అని ప్రశ్నించారు.
ప్రైవేట్ రంగంలోనూ వైఎస్ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఏమైంది? అని మరోసారి ప్రశ్నించారు. వైఎస్ హయాంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు.
కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని నిలదీశారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. అడిగిన ప్రతి ఒక్కరికి వైఎస్ తెల్లరేషన్ కార్డు ఇచ్చారని, 108 అంబులెన్స్ల ఆలోచన వైఎస్ తప్ప ఏ నాయకుడూ చేయలేదని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క కొత్త కార్డు రాలేదని తప్పుబట్టారు.
కేసీఆర్ హయాంలో పెన్షన్లు లేవని, కార్పొరేషన్లకు నిధులు లేవని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ? అని షర్మిల ప్రశ్నించారు.