స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన వైసిసి పార్టీనీ, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరస్కరించాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. నరసరావుపేట పట్టణంలో 8వ వార్డు వెంగళ్ రెడ్డి కాలనీ లో నేడు ఆయన 10 వ రోజు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు.
ఇంటింటికి అమరావతి, NRC వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో ఆయన పర్యటిస్తూ అవగాహన కల్పించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ, నవ మోసాల కరపత్రాన్నిఅరవింద బాబు అందరికి అందచేశారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను కాపాడటంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
రిజర్వేషన్ల తగ్గింపు వెనుక వైసీపీ చేసిన కుట్రను నిరసిస్తూ వైసీపీ ఆగమేఘాలపై విడుదల చేసిన 50 శాతానికి తగ్గింపు జీవోలను టీడీపి నాయకులు కాల్చివేశారు. బీసీ కార్పొరేషన్ సబ్ ప్లాన్ ద్వారా 2014 నుండి 15 వరకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబునాయుడిదేనని వివరించారు. 16 మంది బీసీలు ఉన్న శాసన మండలిని రద్దు చేసిన జగన్ బీసీలపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని ఆరోపించారు. 30 సంవత్సరాలుగా ఉన్న బీసీ రిజర్వేషన్ ని తీసి వేసి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడుస్తున్న జగన్ పాలనకు అనర్హుడని ఆయన అన్నారు. 1994 ఏపీ చట్ట ప్రకారం 34% రిజర్వేషన్ ని తప్పనిసరిగా ఇవ్వాలని చట్టంలోనే ఉంది. రిజర్వేషన్ ని తగ్గించాలంటే చట్టం చేయాలి లేదా ఆర్డినెన్స్ తేవాలి. అదేం లేకుండా బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తున్నది జగన్ ప్రభుత్వం అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.