కోనసీమలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళుతున్న పిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ను అరెస్టు చేయడం అన్యాయమని శ్రీకాకుళం జిల్లా డిసిసి అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఈరోజు ఆమె తన నిరసన తెలియపరిచారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ప్రశాంతతకు నిలయంగా ఉండేది అలాంటిది గత మూడు సంవత్సరాలుగా ఈ వై.సి.పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అట్టుడికిపోతోంది ఏదో ఒక విషయంలో అలజడి చెలరేగుతూనే ఉంది అని అన్నారు. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ,ఎస్టీల పై దురాగతాలు, దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, రోజురోజుకు పెరుగుతున్నాయని ఆమె అన్నారు.
కులాల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం వారి పబ్బం గడుపుకోవడం కోసం కులాలమధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య వైషమ్యాలు పెడుతున్నారు. కోనసీమ ప్రాంతంలో జరిగిన అల్లర్లపై మా పిసిసి అధ్యక్షులు కోనసీమ ప్రాంతాన్ని పర్యటన వెళ్లగా ఆయనను పోలీసులు వెళ్లనివ్వకుండా అరెస్ట్ చేయడం చాలా అమానుషం దీన్ని శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.
ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పరిశీలనకు వెళ్ళకుండా అడ్డుకోవడం వైయస్సార్ పార్టీ అభద్రతా భావానికి నిదర్శనమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డి.గోవింద మల్లి బాబు, డిసిసి కార్యదర్శి రాజేశ్వర్ రావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, ఎస్సీ సెల్ నాయకులు పోరాటం వెంకట్రావు నాయుడు పాల్గొన్నారు.