జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వైసీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. సీనియర్లు సైతం ప్రజారణ్యంలోకి వెళ్ళాలంటే జంకుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యేపై మహిళలు దాడికి దిగారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రెండు దఫాలుగా వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ముస్తఫాకు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో లేకపోయినా బాగా యాక్టీవ్ గా పనిచేశారు. ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో స్నేహపూర్వకంగా ఉండి తన నియోజకవర్గానికి అనేక పనులు చేయించుకుని రాజకీయాల్లో మృధుస్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఆయన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరోసారి గెలిచారు. ఈ క్రమంలో పార్టీ కూడా అధికారంలోకి వచ్చిందని.. ప్రజలకు ఇంకా మంచి సేవ చేయొచ్చునని భావించారు. కానీ ఆయన ఆలోచనలకు భిన్నంగా పరిస్ధితులు ఏర్పడడంతో నియోజకవర్గంలో తిరగ లేకపోతున్నారు. ప్రజా సమస్యలపై.., స్థానిక ఇబ్బందులపై ఏం చేయాలన్నా తీవ్ర నిధుల కొరత వెంటాడుతోంది. దీంతో నిత్యం ప్రజల్లో ఉండే ముస్తఫాకు.. వారికి ఏం సమాధానం చెప్పలో తెలియక మోహం చాటెయ్యడం వంతుగా పెట్టుకున్నారు. ఇదే ఆయనకు కంటిమీద కునుకులేకుంటే చేస్తున్నాయి. గడపగడపకు.., జగనన్న సురక్ష కార్యక్రమాల్లో ఆయనను మహిళలు నిలదీస్తున్నారు. మాకేం పని చేశావో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మహిళలైతే డ్రైనేజీ సమస్యలపై, రోడ్ల విషయాల్లో నిలదీసి ఆయనన్ను రోడ్డుపై కూర్చోపెట్టిన సందర్భాలు అనేకం.
తాజా గురువారం 8వ డివిజన్ లో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. నగరంలో మురుగు అంతా తమ ఇళ్ల మీదకు వస్తుందని పరిష్కారం చేయమంటే పట్టించుకోవు ఏంటీ? అంటూ నిలదీశారు. నగరంలోని మురుగు నీరంతా.. ఇళ్లల్లోకి వస్తున్నాయని.. మనుషులు చస్తున్నా పట్టించుకోరా..? అంటూ పెద్దఎత్తున ముస్తఫాకు చుట్టూ మూగి.. పైకి రావడంతో ఏం సమాధానం చెప్పలో తెలియక అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు.
అంతేకాక గత కొంత కాలంగా ముస్తఫా వైసీపీ విధానాల పట్ల తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. మరోవైపు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటికి ముస్తఫా కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికారులు సైతం ఎమ్మెల్యే మాట వినకుండా పోతున్నారని తూర్పు నియోజకవర్గ ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని పదేపదే కౌన్సిలర్ సమావేశాల్లో ముస్తఫా వాపోయినా ఫలితం శూన్యం. దీంతో ఇక రాజకీయాలు చేయలేం.. త్వరలో సరైన నిర్ణయం ప్రకటించి.., కార్యచరణ ప్రారంభించాలని తన సన్నిహితులతో ముస్తఫా అనేక సందర్భాల్లో వాపోయినట్లు సమాచారం. మరోవైపు ఈ సారి ముస్తఫాకు వైసీపీలో టికెట్ లేదని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ముస్తఫా భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది.