జగన్ ప్రభుత్వం సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేందంటూ ఆగ్రహం విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై కోదండరాముడి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన అత్యంత వైభవంగా జరిగింది. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్ల్యేలు, ఎమ్మెల్సీలు, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, కలెక్టర్ సూర్యకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రాముల వారి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిన నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణాన్ని శ్రీరామ నవమిలోగా పూర్తి చెయ్యాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. ఇదిలా ఉంటే రామతీర్ధంలోని బోడికొండపై కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు బోడికొండపై కొద్దిసేపు హల్ చల్ చేయడం ఉద్రిక్తతకు, ఉత్కంఠకు కారణమైంది.
పది గంటలకు శంకుస్థాపన జరగాల్సి ఉన్నప్పటికీ దానికి గంట ముందే అశోక్ గజపతి కొండపైకి చేరుకున్నారు. కొద్దిసేపు మౌనంగానే ఉన్న ఆయన ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. దేవాలయ సిబ్బంది శిలాఫలకాన్ని తీసుకురావడం చూసిన ఆయన అసంత్రప్తికి లోనయ్యారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ శిలా ఫలకం వద్దకు వెళ్ళి దానిని తిరగేసే ప్రయత్నం చేశారు. తన అనుయాయులతో కలిసి తిరగేసేశారు కూడా. అక్కడి వారు ఎంత చెప్తున్నా, వారించినా ఆయన వినిపించుకోలేదు…పట్టించుకోలేదు…ఆ శిలా ఫలకం లాంటి బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదంటూ భీష్మించారు.
కొండపైన గందరగోళం
దీంతో కాసేపు కొండపై గందరగోళ వాతావరణం, ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వం సంప్రదాయాలకు, సంస్క్రతులకు తిలోదకాలిచ్చేస్తోందని అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. రామతీర్ధం బోడికొండపై ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి సంప్రదాయాలకు విరుద్ధంగా ఏదీ జరగలేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నవన్నీ విరుద్ధంగానే ఉన్నాయన్నారు.
శంకుస్థాపన జరుగుతున్న ప్రదేశానికి అతి సమీపంలో శిలాఫలకం లాంటి బోర్డు పెట్టడమేంటని ప్రశ్నించిన ఆయన ఇలాంటిది ఇంతకు మునుపు తానెక్కడా చూడలేదన్నారు. వైసీపీ వచ్చాక సుమారు వందకు పైగా దేవాలయాలపై దాడులు జరిగితే కనీసం ఒక్కరినైనా పట్టుకున్నారా అని, కనీసం ఆ ప్రయత్నమైనా చేశారా అని ఆయన నిలదీశారు.కాగా రామతీర్ధం బోడికొండపై రాముల వారి ఆలయ పునర్నర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న సమయంలో మంత్రి వెల్లంపల్లి, అశోక్ గజపతి రాజు మధ్య వాగ్వివాదం జరిగింది.
వేద పండితులు ఒక పక్క పూజ నిర్వహిస్తున్న సమయంలో అశోక్ గజపతి సర్కస్…సర్కస్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి వెల్లంపల్లి ఆగ్రహానికి గురయ్యారు. సర్కస్ అనడమేంటని, ఇష్టముంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండని అశోక్ గజపతికి కౌంటర్ ఇచ్చారు. పెద్దరికంగా వ్యవహరించాలే గానీ ఇలాంటి చేష్టలేంటని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే రామతీర్థం బోడికొండపై ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆలయ పునర్నిర్మాణానికి హాజరై తిరిగి వెళుతున్న అశోక్ గజపతి, ఆ సమయంలో కొండపైకి వస్తున్న మంత్రి బొత్స ఒకరికొకరు ఎదురుపడ్డారు. కానీ ఎవర్ని, ఎవరూ పలకరించుకోలేదు…కనీసం మొహం ఎత్తి కూడా ఒకరివైపు మరొకరు చూసుకోలేదు. ఆ సమయంలో ఆ ఇద్దరూ ఎలా వ్యవహరిస్తారోనని అక్కడున్న వాళ్ళంతా ఆసక్తిగా చూశారు.
ఇటీవల వరద సమయంలో చంద్రబాబు-చెవిరెడ్డి భాస్కరరెడ్డి టైపులో పలకరింపులు, నమస్కారం, ప్రతి నమస్కారాల్లాంటివేమైనా ఉంటాయేమోనని చాలా మంది అనుకున్నారు… కానీ అలాంటివేమీ లేకుండా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు.