మహాభారత కావ్యాన్ని అర్ధం చేసుకోవడం ద్వారా ముక్తి మార్గం సాక్షాత్కరిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు, ఋషి పీఠం వ్యవస్థాపకులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శ్రీకాకుళంలోని ఉపనిషమందిరం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బాపూజీ కళామందిర్ వేదికగా ‘పంచమ వేదం-మహాభారతం’ అనే అంశంపై ప్రవచనాల ప్రారంభమైయ్యాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావ్యాలను సృష్టించిన మహాకావ్యం మహాభారతమన్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ఏవిధంగా ఆవిర్భావం జరిగిందో వివరించారు. వేద విజ్ఞానం అందరికీ చేరువకావడానికి సాక్షాత్తు భగవంతుడే మహర్షి వేదవ్యాసుడు ద్వారా మహాభారతాన్ని అందించారన్నారు.
ధర్మ,అర్ధ, కామ,మోక్ష సిద్ధికి పంచమవేదమైన మహాభారత కావ్యంలో అంతర్లీనంగా ఉన్న అంశాలను పరిశీలించాలని ఆయన కోరారు. ఉపనిషమందిరం అధ్యక్ష,కార్యదర్శులు గుమ్మా నగేష్, విశ్వనాధ కామేశ్వర రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.