వారు చిన్న స్థాయి నాయకులు. అయితేనేం. పెద్ద పెద్ద నాయకులకు రాని ఆలోచన వారికి వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లెలో ఉండి కూడా దేశం గురించి ఆలోచించే ఇలాంటి వారివల్లే దేశం ఇంకా సుభీక్షంగా ఉంది.
కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామన్న, ఆయన భార్య టీఆర్ఎస్ మండల మహిళ అధ్యక్షురాలు వనిత ఒక మహత్కార్యానికి తమ వంతు సాయం చేశారు. నేటి రాత్రి 9 గంటలకు 9 నిమిషాల సేపు దీపం వెలిగించాలని, ఆ దీపం వెలుగులో కరోనా మాడి మసి అయిపోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
ఆ పిలుపును అందరూ పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అయితే లాక్ డౌన్ సందర్భంగా తిండే సరిగా దొరకని పేదలకు నూనె, వత్తులు ఎక్కడ దొరుకుతాయి? కాండిల్ వెలిగిద్దామంటే ఎక్కడ నుంచి కొనుక్కోవాలి? ఇలాంటి ఇబ్బందులతో దీపాలు వెలిగించాలని అనుకున్న వారు కూడా వెలిగించే పరిస్థితి ఉండకపోవచ్చు.
అందుకే వీరు నూనె, వత్తులు పేదవారికి పంచిపెట్టారు. కొందరు క్యాండిల్స్ అడిగితే వారికి క్యాండిల్స్ ను అందచేశారు. ఎల్కపల్లి గ్రామం మొత్తం ఈరోజు రాత్రికి కరెంటు దీపాలు ఆర్పేస్తుంది. నూనె దీపాలు వెలిగిస్తుంది.
ఆ దీపాల వెలుగులో కరోనా అంతరించిపోతుంది. ఈ పల్లె చేసే ఈ చిన్న పని దేశాన్ని వెలిగించాలి.