కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున గణేష్ మండపాల ఏర్పాటును ఎట్టి పరిస్థితులలో అనుమతించేది లేదని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. కరోనా కేసుల సంఖ్యను కట్టడి చేయడం, కరోనా వ్యాప్తి నియంత్రించడం లక్ష్యంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతుందని తెలిపారు.
ఇందులో భాగంగానే గణేష్ నవరాత్రుల మండపాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ, శాంతి సంఘం సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో పోలీస్ స్టేషన్ల వారీగా సమావేశాలు నిర్వహించి వారి ద్వారా ప్రజలలో అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే వినాయక విగ్రహాల తయారీదారులకు ఈ సారి మండపాల ఏర్పాటుకు అనుమతి లేనందున విగ్రహాలు తయారు చేసి ఇబ్బందుల పడవద్దని సూచించినట్లు చెప్పారు. కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపధ్యంలో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పోలీస్ శాఖతో కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు.
భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులను ఈ ఏడాది ప్రజలంతా తమ తమ ఇండ్లలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. విపత్కర పరిస్థితుల క్రమంలో ఎట్టి పరిస్థితులలో నవరాత్రుల నిర్వహణకు పోలీస్ శాఖ నుండి అనుమతులు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉంటూ కరోనా వ్యాప్తి నియంత్రణకు తమతో సహకరించాలని డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.