రాష్ట్రంలో అతి పెద్ద లే అవుట్…విజయనగరం జిల్లా గుంకలాం లో రూపుదిద్దుకుంటున్న విదితమే. సీఎం జగన్ చేతుల మీదుగా… ఆ లే అవుట్ ప్రారంభమైన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి… ఆకస్మిక పర్యటన జరిపారు. నగరంలోని ఇళ్లులేని నిరుపేదల కోసం గుంకలాం, కొండకరకాం గ్రామాల వద్ద రూపొందించిన గృహ నిర్మాణ లే అవుట్లలో వచ్చే రెండు నెలల్లో 1300 గృహాల నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ ఆదేశించారు.
గుంకలాం లో 1000, కొండ కరకాంలో 300 పూర్తిచేయాలని ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రైవేట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులకు స్పష్టం చేశారు. మూడో ఆప్షన్ కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం లో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే రెండు నెలల కాలంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను రప్పించాలని, పునాది స్థాయికి మరో 1000 ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
పేదలందరికీ ఇళ్లు పథకంలో గుంకలాం, కొండకరకాంల వద్ద గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన లే అవుట్ లను కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం పరిశీలించారు. ఈ సంధర్భంగా అక్కడ జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణమూర్తి, డి.ఇ.లు, ప్రైవేట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. గుంకలాం లో 8000, కొండ కరకాం లో 2000 ఇళ్ల నిర్మాణం ఆప్షన్ -3 కింద రాక్రీట్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతోందని పి.డి. రమణ మూర్తి వివరించారు.
నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక, ఐరన్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇటుకల తయారీ కూడా అవసరం మేరకు జరుగుతోందన్నారు. తగినంతగా భవన నిర్మాణ కార్మికులు లేకపోవడం వల్లే నిర్మాణంలో జాప్యం జరుగుతోందని వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వచ్చే వారం రోజుల వ్యవధిలో కార్మికులను రప్పించి పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
నిర్మాణ సంస్థ తగిన ముందస్తు ప్రణాళిక లేకుండా నిర్మాణం చేపట్టడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజారోగ్య ఇంజనీరింగ్ ఇ.ఇ. దక్షిణామూర్తి నీ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం కోసం చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని గృహనిర్మాణ సంస్థ పి.డి. ని ఆదేశించారు.
అక్కడ ఏర్పాటు చేసిన ఇటుకల తయారీ యూనిట్ ను కలెక్టర్ పరిశీలించారు. రోజుకు ఎన్ని వేల ఇటుకలు తయారు చేస్తున్నదీ, ఎందరు వర్కర్ లు యీ యూనిట్ లో పనిచేస్తున్నది తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.. కొండ కరకం లే అవుట్ సందర్శించారు. ఈ పర్యటనలో గృహ నిర్మాణ సంస్థ డి.ఇ.లు రంగారావు, వర్మ తదితరులు పాల్గొన్నారు.