ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ కల్పించడానికి చేసిన రాజ్యాంగ సవరణ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు కొన్ని బిసి సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను కొట్టివేసింది. తీర్పులో ఎలాంటి లోపం కనిపించలేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అందువల్ల పునరాలోచనకు ఆస్కారం లేదని తెలిపింది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో (EWS రిజర్వేషన్) 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ లపై గత ఏడాది నవంబర్ 7న రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తులలో ముగ్గురు రాజ్యాంగ సవరణకు మద్దతు పలుకగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్రభట్ లు రాజ్యాంగ సవరణ కు వ్యతిరేకంగా తమ తమ తీర్పులు ఇచ్చారు.
మెజారిటీ న్యాయమూర్తులు రాజ్యాంగ సవరణకు మద్దతు తెలిపినందున ఆ తీర్పునే పరిగణలోకి తీసుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దారులు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, దినేష్ మహేశ్వరి, ఎస్ రవీంద్రభట్, బేలా ఎం త్రివేదీ, జె బి పార్థీవాలా లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను కొట్టివేసింది.
గత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన నిర్ణయాన్ని పునఃపరిశీలించబోమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం కాదని, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాలను మినహాయించడం వివక్షత కాదని పేర్కొంది.