ఈజీగా కొట్టేయచ్చు అనుకున్న ఉక్రేయిన్ రష్యాకు చుక్కలు చూపిస్తున్నది. గత 11 రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటికి 498 మంది రష్యన్ సైనికులు మరణించారు. ఇది రష్యా ఊహించని అంశం. ఉక్రేయిన్ ఇంతగా ప్రతిఘటిస్తుందని, తమ సైనికులు ఇంత మంది చనిపోతారని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావించలేదు. ఈ యుద్ధంలో కనీసం 351 మంది ఉక్రేనియన్ పౌరులు మరణించినట్లు కూడా అంచనా వేస్తున్నారు. అయితే 498 మంది రష్యన్ సైనికుల ప్రాణాలు పోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
ఐక్యరాజ్యసమితి తాజా అంచనాల ప్రకారం ఉక్రేయిన్ పై రష్యా సైనిక దాడి కారణంగా 1.5 మిలియన్ల మంది ప్రజలు ఉక్రెయిన్ నుండి పారిపోయేలా చేసింది. ఈ శరణార్థులు, వారిలో ఎక్కువ మంది ఉక్రేనియన్లు, ఇప్పుడు పొరుగు దేశాలైన పోలాండ్, రొమేనియా, మోల్డోవాలో ఆశ్రయం పొందారు. ఇది ఇలా ఉండగా రష్యాలో యుద్ధ వ్యతిరేక నిరసనలు ఎక్కువ అవుతున్నాయి.
‘యుద్ధ వ్యతిరేక’ నిరసనల్లో పాల్గొన్నందుకు 1,100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా నుంచి వస్తున్న నివేదికలు సూచిస్తున్నాయి. కాల్పుల విరమణపై చర్చలు జరపడానికి రష్యా, ఉక్రేనియన్ ప్రతినిధి బృందాలు రెండు రౌండ్ల చర్చలు జరిపాయి. అయితే ఆ చర్చలు ఫలించలేదు. మూడవ రౌండ్ చర్చలు మార్చి 7 న జరుగుతాయని భావిస్తున్నారు.