ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి ప్రభుత్వం జీవో 58 ద్వారా కల్పించిన క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్, అధికారులతో జీవో 58 అమలు ప్రక్రియ పురోగతిపై సమీక్షించి, సమర్పించిన ఫైళ్ల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్ర పరిశీలన ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చేపట్టాలని అన్నారు. జిల్లాలో జీవో 58 క్రింద క్రమబద్ధీకరణ కు 17046 దరఖాస్తులు రాగా, 14266 దరఖాస్తుల క్షేత్ర పరిశీలన పూర్తికాగా, మిగులు 2780 దరఖాస్తుల క్షేత్ర పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. చిరునామా రుజువు నిమిత్తం ఓటర్ ఐడి, ప్రాపర్టీ ట్యాక్స్, రేషన్ కార్డు లను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉంటున్న నివాసం నెంబరు, ఆధారాల్లో ఉన్న ఇంటి నెంబర్ సరిచూడాలన్నారు. జీవో 58 పోర్టల్ లో స్ట్రక్చర్ ఉందా లేదా చూడాలన్నారు.
స్థల స్వాధీనం అన్నది మాండేటరీ అని ఆయన తెలిపారు. 2019, ప్రస్తుత గూగుల్ ఎర్త్ మ్యాప్ సమర్పించాలన్నారు. ప్రతి దరఖాస్తును హాబీటేషన్ వారిగా చేపట్టాలన్నారు. జిల్లాలో జీవో 58 క్రింద క్రమబద్ధీకరణ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేసేలా పర్యవేక్షణ అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఎస్డీసి రాజేశ్వరి, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, ఆర్డీవో కార్యాలయ డీఏఓ శైలజ, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.