జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో చెలరేగిపోతున్న పాకిస్తాన్ కు భారత సైనికులు గట్టిగా బుద్ధి చెప్పారు. మొత్తం ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయి.
పెద్ద ఎత్తున పాకిస్తాన్ బంకర్లు, ఆయుధ సామాగ్రి దాచిన ప్రదేశాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. గత రెండు రోజులుగా జమ్మూ కాశ్మీర్ లోని భారత సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత సైనికులను చీకాకు పెడుతున్న పాకిస్తాన్ పై నేడు కాల్పుల వర్షం కురిపించి గట్టిగా బుద్ధి చెప్పారు.
భారత్ తమ భూభాగంలోని పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డదని పాకిస్తాన్ మీడియా గగ్గోలు పెడుతున్నది. ఉత్తర కాశ్మీర్ లో మోహరించిన మిస్సైల్స్ ను భారత్ సమర్ధంగా ప్రయోగించి పాకిస్తాన్ పీచమణిచింది. భారీ యుద్ధ టాంకులు జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్ తోకముడిచి పారిపోయింది.
నలుగురు భారతీయ భద్రతాదళాలను పాకిస్తాన్ సైనికులు పొట్టన పెట్టుకోగా దానికి భారత్ ప్రతీకార దాడులు నిర్వహించింది. దావర్, కేరాన్, ఊరీ, నౌగామ్ సెక్టార్లలో పాకిస్తాన్ గత రెండు రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్ల పొడుతూ విచ్చలవిడిగా మోర్టార్లను ప్రయోగించింది.
భారత్ వైపు పౌరులను కూడా పాకిస్తాన్ సైన్యం టార్గెట్ చేసుకుంది. కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ కు ఇంతగా నష్టం ఎప్పుడూ వాటిల్లలేదు.