ఈ ఏడాది నవంబర్ 15నాటికి భూమి మీద మానవ జనాభా 8వందల కోట్లను దాటనుంది. ఈ మైలురాయి చేరేందుకు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో దీనిపై చర్చ మొదలైంది.నవంబర్ 15 నాటికి భూమిపై జీవనం సాగిస్తున్న మానవ జనాభా 8వందల కోట్లకు చేరనుందని జూలైలో ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ సందర్భంగా మనిషి తాను సాధించిన పురోగతిని చూసి గర్వించాల్సిన సమయం వచ్చిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అలాగే ఈ భూగోళాన్ని కాపాడుకునేందుకు మనిషికి గల గురుతర బాధ్యతలను గుర్తు చేసింది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023 కల్లా ప్రపంచంలోనే అధిక జనాభా గల చైనాను వెనక్కి నెట్టి భారత్ అగ్ర స్థానంలో నిలవనుంది.
మరో ఎనిమిదేళ్లలో అంటే 2030 కల్లా ప్రపంచ జనాభా 850కోట్లు, 2050 వరకు 970కోట్లు, 2080లో వెయ్యి 40కోట్లకు చేరనుంది. ఆ తర్వాత మరో ఇరవై ఏళ్లు అంటే 2100 వరకు మానవ జనాభా వెయ్యి 40 కోట్ల వద్ద స్థిరంగా కొనసాగనుంది. 2050 వరకు పెరగనున్న జనాభాలో సగం వాటా కేవలం భారత్, పాకిస్థాన్, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల నుంచే ఉండనుంది.
భూగోళంపై పెరుగుతున్న జనాభా మనిషి సాధించిన గణనీయమైన పురోగతిని గుర్తు చేస్తుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ వ్యాఖ్యానించారు. వివిధ రంగల్లో ముఖ్యంగా వైద్యారోగ్య రంగంలో మనం సాధించిన వృద్ధి మనిషి జీవిత కాలాన్ని పెంచడం సహా శిశు మరణాలను తగ్గించినట్లు గుర్తు చేశారు. మనుషులందరూ సుస్థిరమైన లక్ష్యాలతో భూగ్రహాన్ని కాపాడుకునే ఉమ్మడి బాధ్యతను స్వీకరించాలని ఐక్యరాజ్య సమితి వివరించింది.