మహాత్మా గాంధీ ప్రాణాలను రక్షించిన సాహసయోధుడు బతఖ్ మియా అన్సారి జీవితంపై చరిత్రకారుడు సయ్యద్ నశీర్ అహమ్మద్ నాలుగు భాషల్లో వెలువరించిన పుస్తక ఆవిష్కరణ తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. స్థానిక పల్లెటూరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు జొన్నా రాజేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నశీర్ అహమ్మద్ మాట్లాడుతూ 1917లో గాంధీజీ ప్రాణాలు కాపాడిన సాహసయోధుడు బతక్ మియా అన్సారీ అని తెలిపారు. ఆయన జీవిత చరిత్రను వివరిస్తూ తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ భాషల్లో రాసిన పుస్తకం ఇది అని ఆయన తెలిపారు. ఈ సాహస యోధుడి గురించి చాలా మందికి తెలియదని అందువల్ల తాను ఎంతో విశేషమైన పరిశోధన చేసి ఈ గ్రంధాన్ని రూపొందించానని ఆయన వివరించారు. ముందుగా 21,000 కాపీలు ముద్రించినట్టు ఆయన వెల్లడించారు. ఈ పుస్తకాలను దేశంలోని 270 ప్రాంతాల లోని వ్యక్తులు, సంస్థలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. గ్రంధాలయాలకు, ఆసక్తిగల పాఠకులకు ఉచితంగా ఈ పుస్తకాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ పుస్తకావిష్కరణకు విశిష్ట అతిధులుగా విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంకమ్మరావు, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ టి ఎస్ రావు, ప్రముఖ రచయిత, పూర్వపు డిప్యూటీ కలెక్టర్ నూర్ బాషా రహంతుల్లా, పల్లెటూరు ట్రస్ట్ ఫౌండర్ జొన్నా రాజేష్ లు నాలుగు గ్రంధాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఐ అంకమ్మరావు మాట్లాడుతూ మహానుభావుల చరిత్రలు ఎన్నడూ మరువరాదన్నారు. మనకు స్వాతంత్య్రం ప్రసాదించిన మాన పూర్వీకుల సాహసోపేత చరిత్రలను వెలికి తీసి వెల్లడిస్తున్న నశీర్ అహమ్మద్ కు అందరూ చేయూత ఇవ్వాలన్నారు. డాక్టర్ టీఎస్ రావు మాట్లాడుతూ విస్మరించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివరిస్తూ 17 పరిశోధనాత్మక చరిత్ర గ్రంధాలను రచించిన నశీర్ అభినందనీయుడు అన్నారు. ప్రముఖ రచయిత నూరుబాషా రహంతుల్లా మాట్లాడుతూ మన పూర్వీకుల సమాచారం విద్యార్థులు, యువకులు తెలుసుకుని స్ఫూర్తి పొందాలంటే ఆయా చరిత్రలను పాఠ్యపుస్తకాలలో చోటు కల్పించాలన్నారు. పలువురు ప్రముఖులు పాల్గొన్న పుస్తకావిష్కరణ సభ శ్రీ వందన సమర్పణతో ముగిసింది.
previous post