కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దివ్యాంగుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామడుగు మండలం తిరుమలపూర్ అనుబంధం కారుపాకులపల్లిలో దివ్యాంగుడు చామంతుల కొమురయ్య (60)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు ఎస్సై అంజయ్య తెలిపారు.
కొమురయ్య తల్లి మల్లమ్మ తెల్లవారుఝామున నిద్ర మేలుకొని చూడగా వికలాంగుడైన కొమురయ్య చనిపోయి ఉండడం గమనించింది. విషయాన్ని తన చిన్న కొడుకుకు తెలుపడతో అతడు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవీందర్, ఎస్సై అంజయ్య కొమురయ్య హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా , కారుపాకలపల్లిలో అదే గ్రామానికి చెందిన నీలం ఐలయ్య అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. కొమురయ్యకు, ఐలయ్యకు మధ్య భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.