రాజమండ్రి నగరంలో ఆదివారం రాత్రి ఒక ఎలక్ట్రానిక్స్ షాపులో మంటలు చెలరేగాయి. సరిగ్గా అదే సమయానికి మెయిన్ రోడ్డును పరిశీలించడానికి వచ్చిన ఎంపీ భరత్ ఆ మంటలను చూసి వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేసి క్షణాల్లో సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా మంటలు పూర్తిగా
తగ్గే వరకూ అక్కడే ఉండి సహాయక చర్యల్లో ఆయన వంతు పాత్రను పోషించడంతో పలువురి మన్ననలు పొందారు. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి 9.40 గంటల ప్రాంతంలో మెయిన్ రోడ్డు వన్ టౌన్ పోలీసు స్టేషను ఎదురుగా ఏ టూ జడ్ షాపు పైన గల మహావీర్ ఎలక్ట్రానిక్స్ షాపు లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆదివారం కావడంతో
దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. ఆ సమయానికి మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులు, వీధి వ్యాపారుల వ్యాపార నిర్వహణ తీరును పరిశీలించేందుకు అటుగా నడుచుకుంటూ వస్తున్న ఎంపీ భరత్ మంటలు ఎగసిపడటాన్ని గమనించారు.
వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి ఎంపీ భరత్ ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. జనం కూడా గుమిగూడారు. ఆ వెంటనే షాపు యజమాని భరత్ కుమార్ జైన్ అక్కడకు వచ్చారు. అగ్నిమాపక శకటం క్షణాల్లో సంఘటనా స్థలానికి
చేరుకుంది. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. భారీ నష్టం జరగకుండా నివారించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియదు. కాగా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకూ ఎంపీ భరత్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించడం పట్ల నగర వాసులు అభినందనలు తెలిపారు.