న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అందరు చూస్తూనే సిగ్గుమాలిన పని చేశాడు. బిజినెస్ క్లాస్లో కూర్చున్న 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మహిళ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా క్యాబిన్ క్రూ సభ్యులు ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్కు లేఖ రాశారు. ఆయనకు తెలిపిన తర్వాతే కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన నవంబర్ 26, 2022 నాటిది. క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి విమానంలోని సిబ్బంది అప్రమత్తంగా లేరని మహిళ తన లేఖలో రాసింది. ప్రయాణీకుల భద్రత కోసం విమానయాన సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు.
న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం ఏఐ-102లో ప్రయాణించినట్లు ఆ మహిళ తన లేఖలో పేర్కొంది. మధ్యాహ్న భోజనం తర్వాత విమానం లైట్లు ఆర్పారు. ఇంతలో ఓ తాగుబోతు తన సీటు దగ్గరికి వచ్చితనపై మూత్ర విసర్జన చేశాడని ఆమె తెలిపారు.
ఆ తర్వాత కూడా ఆ వ్యక్తి తన దగ్గరే నిలబడి ఉన్నాడని, సహ ప్రయాణికుడు చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఆమె వివరించారు. ఘటన తర్వాత తన బట్టలు, బ్యాగ్, బూట్లు పూర్తిగా మూత్రంతో తడిసిపోయాయని మహిళ తెలిపింది. ఆమె ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేశారు. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చి క్రిమిసంహారక మందు పిచికారీ చేసి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత ఆమెకు ఒక జత పైజామా, డిస్పోజబుల్ చెప్పులు ఇచ్చారు.
అయితే మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహిళ పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టాటా గ్రూప్ ఛైర్మన్కు లేఖ రాయడంతో, ఎయిర్ ఇండియా చర్యకు ఉపక్రమించింది. నవంబర్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇది కాకుండా, సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఎయిర్ ఇండియా ఒక అంతర్గత కమిటీని కూడా ఏర్పాటు చేసింది.