వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అగ్రనేతలు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే వీరి పర్యటనలని కావాలనే టార్గెట్ చేస్తూ కొందరు అలజడులు సృష్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితులు, రాళ్ల దాడులు, వారి భద్రత విషయంలో పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యం అంశాలను టీడీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీనితో చంద్రబాబు,లోకేశ్ లకి కల్పించిన భద్రతపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ
ఏపీ సీఎస్, డీజీపీలకు లేఖ రాసింది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్ పై ఇటీవల జరిగిన దాడులపై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది. లోకేశ్ పాదయాత్రలో కల్పిస్తున్న భద్రత వివరాలను కేంద్ర హోంశాఖ కోరింది. చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో బయట పడుతున్న భద్రతా చర్యల ఉల్లంఘనలపై కేంద్రానికి ఎంపీ కనకమేడల లేఖ రాశారు. భద్రత కల్పనలో జగన్ ప్రభుత్వం విఫలమైందని కనకమేడల ఫిర్యాదు చేశారు. ఎంపీ కనకమేడల లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడిపై నివేదిక కోరింది.
చంద్రబాబు, లోకేశ్ పర్యటనల్లో భద్రత కల్పించాలని ఆదేశించింది. జులై 27న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ లేఖ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వకముందే పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ల దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అన్ని అంశాల పైన కేంద్ర హోమ్ శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు చంద్రబాబు సెక్యూరిటీని రివ్యూ చేసిన ఎన్ఎస్ జీ కొత్తగా మరో 20 మంది కమాండోలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు.
అప్పటి వరకు ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరి నిబంధనల ప్రకారం షిఫ్ట్ కు ఎనిమిది మంది భద్రత కల్పించేవారు. అయితే ఏడాది నుంచి వారి సంఖ్యను మరో 20 మందికి పెంచారు. అప్పటివరకు డీఎస్పీ ర్యాంక్ అధికారి పర్యవేక్షణలో ఆయన భద్రత ఉండేది. ఈ ఏడాది నుంచి డిఐజి స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉండడం, చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో హోంశాఖ సృష్టి సారించింది.
చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారుని, చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు వేసినా పెద్దగా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగినప్పుడు ఓ వృద్ధుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ వ్యవహారం కూడా దుమారం రేపింది. ఇప్పుడు పుంగనూరులోనే అలాంటి పరిస్థితే ఏర్పడటంతో.. కేంద్రం చంద్రబాబు, లోకేష్ ల భద్రతపై చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో టీడీపీ నేతలు కోరుతున్నారు .