జిల్లాలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆధార్ క్యాంపులో జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య తన ఆధార్ ను అప్ డేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లా ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమఅభివృద్ధి పథకాలు, పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్ అప్ డేట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.
వివిధ ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్, సిమ్ కార్డు తీసుకునేందుకు, రేషన్ కార్డు పొందడం వంటి పలు సేవలు సులభంగా పొందాలంటే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్డు వివరాలు పునరుదించుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఆధార్ అప్ డేట్ కు సంబంధించిన సమాచారం, వివరాలు కోరకు టోల్ ఫ్రీ నెంబర్ 1947, help@uidai.net.in వెబ్ సైట్ ను వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఆధార్ స్పెషల్ డ్రైవ్ ను విజయ వంతంగా పూర్తి చేయాలని, UIDAI నిబంధనల ప్రకారం మాత్రమే రుసుము తీసుకోవాలని ఎక్కువ రుసుము తీసుకుంటే ఆధార్ సెంటర్ పై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇ – డిస్ట్రిక్ట్ మేనేజర్ సమాజి దేవేందర్ కి సూచించారు.
ఆధార్ అప్డేట్ పట్ల అవగాహన కల్పించాలని గ్రామా పంచాయతీ లలో టాంటాం వేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమములో జిల్లా ఇ – డిస్ట్రిక్ట్ మేనేజర్ సమాజి దేవేందర్, మీసేవ మేనేజర్ విజయ్, ఆధార్ సెంటర్ నిర్వహకుడు రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.