నూతనంగా దరఖాస్తు చేసుకొన్న వితంతు,వృద్ధాప్య,ఒంటరి మహిళల వికలాంగుల ఆసరా పింఛన్ వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం డి.ఆర్.డి.ఏ పిడి కిరణ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంపీ అజీజ్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని,ఎన్నికల ముందు ఇచ్చిన 57 సంవత్సరాల వయసుగల వారికి ఆసరా పింఛన్ మంజూరు చేస్తామని చెప్పి 4 సంవత్సరాలు గడిచినప్పటికి నేటి వరకు కూడా అమలు కాకపోవటంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారని, ఇచ్చిన హామీని ప్రభుత్వం తక్షణమే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.
కొన్ని గ్రామాలలో వృద్ధులకి బయోమెట్రిక్ పడక ఇబ్బందులు పడుతున్నారని,వారికి పంచాయతీ కార్యదర్శి,బిల్ కలెక్టర్ ద్వారా పింఛన్లు ఇప్పించాలని కోరారు.గత 4 సంవత్సరాల నుండి వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వృద్ధులు అనేక మంది దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు వివిధ రూపాల్లో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులుగా గుర్తించి ప్రభుత్వ ఉన్నత అధికారులకు అప్లోడ్ చేయటం జరిగినా నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు నూతనంగా మంజూరు చేయకపోవటం విచారకరమని అన్నారు. దీనివల్ల లబ్ధిదారులు ప్రతిరోజు పంచాయతీ కార్యాలయం,మున్సిపాలిటీ,మండల కార్యాలయాల చుట్టూ పెన్షన్ వస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు.
అర్హులైన పేదవారికి ఆసరా ఫించన్ వస్తే కుటుంబ పోషణకు కొంత ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని,తమరి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేసి లబ్ధిదారులను ఆదుకోవాలని,ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మహ్మద్ అజీజ్ పాషా అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మెట సుబ్బరాజు,జక్కుల మల్లయ్య,ముశం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్