వైసీపీ నాయకులకు తాజా టార్గెట్ గా కుప్పం నియోజకవర్గం మారింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి ఇంత కాలం పెట్టని కోటగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు అక్కడ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు ఉదయం మూడో దశ లో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని పంచాయితీలకు పోలింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో కుప్పం పంచాయితీ ఎన్నికలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు, కుప్పం నియోజకవర్గంలోని పంచాయితీలు మన కైవసం కావాలి అని వైసీపీ అధిష్టానం పై నుంచి ఆదేశాలు ఇవ్వడంతో చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలో దిగారు.
గత కొద్ది రోజులుగా కుప్పం నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి ఉన్నారు. ఈ సారి పంచాయితీ ఎన్నికలలో ఒక్క పంచాయితీ కూడా చంద్రబాబు ఖాతాలో పడే అవకాశం లేకుండా మంత్రి పెద్దిరెడ్డి ఏర్పాటు చేశారని వైసీపీ నాయకులు అంటున్నారు.
కుప్పంలో పంచాయితీలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకునేలా చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు ఆట కట్టించవచ్చునని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అందుకోసం అందరు సర్పంచ్ లు వైసీపీ వారే ఉండేలా చేయాలని జగన్ ఆదేశాలు ఇవ్వగా దాన్ని మంత్రి పెద్దిరెడ్డి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే అన్ని పంచాయితీలలో బయటి వ్యక్తులు వచ్చారని చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. కుప్పంలోని అన్ని లాడ్జీలలో బయట నుంచి వచ్చిన వ్యక్తలు తిష్టవేసి ఉన్నారని వారు పంచాయితీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు వచ్చారని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ఏది ఏమైనా చంద్రబాబుకు రేపు జరగబోయే కుప్పం పంచాయితీ పోలింగ్ అగ్ని పరీక్షగా మారింది.