అన్నమయ్య జిల్లా రాజంపేట నూతన సబ్ కలెక్టర్ గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళ వారం బాధ్యతలు స్వీకరించగా, బుధవారం నందలూరు లో కన్యక చెరువు కట్టపై అక్రమ కట్టడాల తొలగింపు పై కొరడా ఝులిపించారు. ఇటీవల చెరువులో చేపలు పట్టే జాలరి కుటుంబాలు రెండు గదులు చెరువు కట్టపై నిర్మాణం చేపట్టారు.
వాటిపై పలువురు ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్,రెవెన్యూశాఖ అధికారులు తొలగింపుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్థానిక మండల అధ్యక్షుడు మేడా విజయ బాస్కర్ రెడ్డి స్వయంగా రంగంలో కి దిగి తాను కలెక్టర్ తో మాట్లాడి తాత్కాలిక గదులు నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేసిన ట్టు తెలిపారు. వారు వాటి నిర్మాణం చేపట్టారు.
అయితే అనూహ్యంగా నూతన సబ్ కలెక్టర్ వాటి నిర్మాణం కు కలెక్టర్ అనుమతులు లేవని తొలగింపుకు శ్రీ కారం చుట్టారు. జాలరి కుటుంబ సభ్యులు తమతో పాటూ సమీపంలో ఉన్న ఆక్రమణలు కూడా తొలగించాలని,ఇటుక బట్టీలను తొలగించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని తాసీల్ధార్ సంగరాజు కాళ్లకు దండం పెట్టి కట్టడాలు తొలగించ వద్దని వేడుకొన్నారు.
స్థానిక వైసీపీ నేతలు జంబు సూర్య నారాయణ, అమీర్, కలీమ్,నడివీధి సుధాకర్ తదితరులు తొలగింపు పై అభ్యంతరం వ్యక్తం చేయగా, సబ్ కలెక్టర్ నిరాకరించారు. సంఘటనా స్థలంలో మహిళా పోలీసులతో స్థానిక ఎస్సై మైనుద్దీన్ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.