పదవీ విరమణ చేయనున్న ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాథ్ దాస్ ను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో జగన్ రెడ్డి సలహాదారులను నియమించుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. మింగ మెతుకు లేదు- మీసాలకు సంపంగి నూనె అన్నట్లుంది జగన్ ప్రభుత్వ వాలకం అని ఆయన అన్నారు. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు మంత్రుల కంటే సలహాదారుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు , పెన్షన్ దారులకు పింఛను సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బడి ముబ్బడిగా సలహదారుల నియామకం అవసరమా? అని తులసిరెడ్డి ప్రశ్నించారు.
ఒక్కొక్క సలహదారునికి నెలకు గౌరవ వేతనం రూ.3.82 లక్షలు, సిబ్బంది , కార్యాలయం అదనంగా ఇస్తున్నారని ఆయన అన్నారు. ఇది దుబారా కాదా?. అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి ఇలా దుబారా చేయడం భావ్యం కాదని తులసిరెడ్డి అన్నారు.