ఏఐటియుసి ప్రధమ మహాసభలు కొల్లాపూర్ పట్టణంలో ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించతలపెట్టినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శ కొమ్ము భరత్ వెల్లడించారు. మహాసభల కరపత్రాన్ని కొల్లాపూర్ పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920 అక్టోబర్ 30న ముంబయి మహానగరంలో ఆవిర్భవించిన మొట్టమొదటి కార్మిక సంఘం, దేశంలో మొదటగా ఆవిర్భవించిన కార్మిక సంఘం కూడా ఏఐటియుసి అని ఆయన అన్నారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక సంఘం తమదని ఆయన తెలిపారు. నాటి నుంచి నేటి వరకూ కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ అనేక సమరశీల ఉద్యమాల ద్వారా దేశంలో రాష్ట్రంలో కార్మిక చట్టాలను తీసుకొచ్చే విధంగా ఏఐటియుసి చేసిదని ఆయన అన్నారు. లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, వి గిరి, ఎస్ ఏ డాంగే, ఇంద్రజిత్ గుప్తా లాంటి మహనీయులు ఏఐటియుసి కార్మిక ఉద్యమ నాయకులేనని ఆయన తెలిపారు. అంగన్ వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, మునిసిపాలిటీ, గ్రామ పంచాయితీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఏఐటియుసి నిరంతరంగా పోరాడుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. అసంఘటిత రంగాలైన హమాలీ, భవన నిర్మాణ, ఆటో రంగ కార్మికులకు ఏఐటియుసి నిరంతరంగా పోరాడుతుందని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్మాణ రంగం, రైస్ మిల్లులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ట్రాన్స్ పోర్టు, బట్టల దుకాణాలు పలు రంగాలలో వేలాది మంది కార్మికులు చాలీ చాలని జీతాలతో పని చేస్తున్నారని సమయం లేని పనిగంటలతో సతమతం అవుతున్నారని ఆయన అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రం లోని టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక చట్టాలను ధ్వంసం చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మహాసభలలో అన్ని వర్గాల కార్మికుల సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ సభలకు ముఖ్య అతిధిగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఎస్ బోస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నరసింహ హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ ఎం డి ఫయాజ్, వినయ్, శివ, దాసు, హుస్సేన్, పండు, శ్రీను, కరుణాకర్, తిరుపతయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
previous post