రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పురపాలక ఎన్నికల నిర్వహణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 17 మున్సిపాలిటీలు, 5 మున్సిపల్ కార్పొరేషన్లకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు జోన్ల పరిధిలోని 19 పోలీసు స్టేషన్ల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల కోసం 4107 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తులు 598 ఆయుధాలు సరెండర్ చేశారని తెలిపారు. 216 మంది రౌడీ షీటర్లను ఇప్పటికే బైండోవర్ చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.80 వేల నగదు, 843 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.