రాష్ట్రంలో మంజూరు చేసిన సూక్మ,చిన్న,మధ్యతరహా(ఎంఎస్ఎంఇ) యూనిట్లన్నీసకాలంలో ప్రారంభమయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఇ,ఎపిఐఐసి విభాగాలపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఇ కింద రిజిష్టర్ అయిన యూనిట్ల వివరాలను పరిశీలించి నెలవారీ ప్రారంభమైన యూనిట్ల డేటాను సేకరించి నివేదిక పంపాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.
మంజూరైన యూనిట్లన్నీత్వరిత గతిన ప్రారంభం అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.అదే విధంగా క్లస్టర్ డెవల్ప్మెంట్ ప్రోగ్రామ్(సిడిపి)కింద మంజూరైన యూనిట్లన్నిటినీ ఫాస్ట్ ట్రాక్ లోనికి తీసుకురావడం తోపాటు కేంద్ర ఎంఎస్ఎంఇ కార్యదర్శి వారికి వివరాలు పంపి సకాలంలో సహాయం అందేలా చూడాలని తెలిపారు.
సిడిపి కార్యక్రమాన్ని జిల్లా కలక్టర్లు తరచు సమీక్షించాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.సిడిపి లకు సంబంధించి కొత్త భవనాల కోసం ఎదురు చూడక అందుబాటులో ఉన్న భవనాల్లో వీటిని ఏర్పాటు చేయాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎంఎస్ఎంఇ యూనిట్ల ద్వారా తయారయ్యే ఉత్పత్తులపై వెంటనే ఎపి ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ను అభివృద్ధి చేయాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా 2015 నుండి మంజూరై ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఇ యూనిట్ల వివరాలను సేకరించి వాటి ప్రస్తుత స్థితిగతులపై ఒక నివేదిక సమర్పించాలని చెప్పారు.
విశాఖపట్నం,కొప్పర్తి,గుంటూరుల్లో ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీ సెంటర్లను త్వరగా ఫాస్ట్ ట్రాక్ లోనికి తీసుకురావాలని ఆదేశించారు.అనంతరం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పధకం (పిఎంఇజిపి) అమలు,ఎపిఐఐసి ద్వారా భూములు కేటాయించబడిన యూనట్ల స్థితిగతులపై కూడా నివేదికను వచ్చే సమావేశానికి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు పరిశ్రమల శాఖ కమీషనర్ మరియు ఎపిఐఐసి ఎండి ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంఎస్ఎంఇ రంగంలో ఏర్పాటైన యూనిట్లు,ఎపిఐఐసికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో పరిశ్రమలు,ఏపిఐఐసి విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.