సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల,శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆళ్వారుల సేవా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి.
వేకువ ఝామున సుప్రభాత సేవతో ప్రారంభించి,తిరుప్పావై సేవాకాలం జరిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించారు. అధ్యయనోత్సవాలు నిర్వహించే ఆళ్వార్లను తులసి మాలలతో అలంకరించి,భద్ర పీఠంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆళ్వారుల పల్లకి సేవ ముందు అర్చక బృందం, ఋత్విక్కులు ఆయుర ప్రబంధ, చతుర్వేద,భగవత్ విషయాలు గీతా, రామాయణం, భాగవత, విష్ణు సహస్రనామ పారాయణం,వేద పఠనం జరిపారు. మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ నేత్రపర్వంగా సాగింది.
ప్రధాన అధ్యాపకులు శ్రీమాన్ బదరీ నారాయణా చార్యులు ఆలపించిన “పల్లాండు పల్లాండు” కీర్తన భక్తులను రంజింప చేసింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి, స్థానాచార్యులు శ్రీనివాసాచార్యులు, అర్చకులు నరగిరినాధుని నరసింహాచార్యులు, నరగిరినాధుని రంగభట్రాచార్యులు, భాస్కరాచార్యులు,మురళి కృష్ణమాచార్యులు,భక్తులు,ధర్మకర్తల మండలి సభ్యులు రామిశెట్టి రాము,మేరిగి గురవయ్య,వెన్న పద్మ,కోలపాటి వెంకటేశ్వర్లు,లక్క వెంకన్న,దోసపాటి నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్