భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ లో నేడు ఒక అద్భుతం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సతీమణి జిల్ బిడెన్ ఆదివారం పశ్చిమ ఉక్రెయిన్ లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సతీమణి ఒలెనా జెలెన్స్కీని ఆమె కలిశారు.
మదర్స్ డే రోజున ఇక్కడికి రావాలని భావించాను. అందుకే వచ్చాను అని జిల్ ఒలెన్నాతో చెప్పారు. తమతో పాటు అమెరికా ప్రజలు నిలిచారని ఉక్రెయిన్ ప్రజలు భావించాలనేదే తన రాకలోని ఉద్దేశ్యమని ఆమె అన్నారు. ఉక్రెయిన్ సరిహద్దులో వీరిద్దరూ కలుసుకున్నారు. స్లోవేకియా గ్రామంలో ఉన్న ఒక పాఠశాలలో ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. చిన్న క్లాస్రూమ్లో కూర్చుని వారు మాట్లాడుకున్నారు. జిల్ ఉక్రెయిన్లో రెండు గంటల పాటు గడిపారు.
ఈ సాహసోపేతమైన చర్యకు ఒలెన్నా జిల్కు కృతజ్ఞతలు తెలియజేసింది. యుద్ధ సమయంలో అమెరికా ప్రథమ మహిళ ఇక్కడికి రావడం ప్రాముఖ్యతను మేం అర్థం చేసుకోగలమని అన్నారు. రోజూ సైనిక దాడులు జరుగుతున్న సమయంలో ఆమె ఇక్కడికి వచ్చారు. అంతకుముందు మార్చిలో, పోలాండ్ పర్యటనలో, జో బిడెన్ భద్రతా కారణాల దృష్ట్యా తనను అనుమతించనందున పరిస్థితిని తన కళ్లతో చూడటానికి ఉక్రెయిన్కు వెళ్లలేకపోయానని అందువల్ల నిరాశ చెందానని ఆమె చెప్పారు. అధ్యక్షుడు ఉక్రెయిన్కు వెళ్లాలనుకుంటున్నారని, అయితే ప్రస్తుతానికి దాని గురించి ఎటువంటి ప్రణాళికలు లేవని ఇటీవల వైట్హౌస్ తెలిపింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో యుద్ధం మధ్య అకస్మాత్తుగా ఉక్రెయిన్ చేరుకున్నారు. అదే సమయంలో ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే ఉక్రెయిన్ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విధ్వంసానికి గురైన ఇర్పిన్ నగరాన్ని సందర్శించారు. ఈ సమాచారాన్ని ఉక్రెయిన్ మీడియా ఇన్స్టిట్యూట్ మరియు ఇర్పిన్ మేయర్ ఒలెక్సాండర్ మార్కుషిన్ అందించారు. అయితే, ట్రూడో పర్యటనపై కెనడా అధికారులు ఇంకా స్పందించలేదు. ఉక్రెయిన్కు సంఘీభావం తెలిపేందుకు పాశ్చాత్య నేతల పర్యటనలో భాగంగా ట్రూడో పర్యటన జరిగింది.