ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవడానికి నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. వైరస్ను గుర్తించేందుకు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు.
ఈ నెల 31తో లాక్డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే. మరో రెండువారాల పాటు ఆంక్షలను కొనసాగించాలని పలువురు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతుండగా సీఎం జగన్ అభిప్రాయాన్ని సైతం అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఇక ఆంక్షలు ఉండాల్సిన అవసరం లేదని జగన్ చెప్పినట్లు తెలిసింది.
దేశంలో లాక్డౌన్ పొడిగింపుపై నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమిత్ షా భేటీ కానున్నారు. ముఖ్యమంత్రులు వెల్లడించిన సమాచారంపై వీరు చర్చించనున్నారు.