ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ తాజాగా చేపట్టిన ఎక్రెడిటేషన్ల జారీ ప్రక్రియపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టులకు ఎక్రెడిటేషన్ల మంజూరులో పాటించాల్సిన నియమ నిబంధనలపై 2005లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జివోఎంఎస్ నెం. 92ను ఇప్పటి ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని పిటిషన్ దాఖలు అయింది.
దాని స్థానంలో జివోఎంఎస్ నెం.142ను జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తులు ప్రశ్నించగా ఆయన వద్ద తగిన సమాచారం లేకపోవడంతో నాలుగు వారాల లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ మేరకే సమాచార శాఖ కార్యదర్శికి, కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ నెలలోనే ప్రభుత్వం జివోఎంఎస్ నెం. 92ను రద్దు చేసి జివోఎంఎస్ నెం. 142ను విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో తామే ప్రధాన జర్నలిస్టు సంఘాలమంటూ ప్రభుత్వం వద్ద పెత్తనం చలాయిస్తున్న యూనియన్లు జివోఎంఎస్ నెం. 142పై ఏ విధమైన పోరాటం చేయలేదు.
నూతన జివో కనుక అమలు జరిగితే రాష్ట్రంలో ప్రస్తుతం జర్నలిజం వృత్తిలో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఎక్రెడిటేషన్ల కోల్పోయే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా చిన్న పత్రికలకు ఎక్రెడిటేషన్ల మంజూరయ్యే అవకాశం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబు రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా సమగ్ర సమాచారం సేకరించి న్యాయపోరాటానికి దిగారు.