ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తూ, ప్రజాస్వామ్య హననం చేస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ ముట్టడి కార్యక్రమానికి అఖిల భారత యువజన సమాఖ్య యువజన సంఘం గా మేడ్చల్ జిల్లా నాయకత్వం పాల్గొన్నది. ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ భారత దేశంలో గవర్నర్ ల వ్యవస్థ ప్రజల హక్కులను కాలరాసే విధంగా మారాయని,దీనికి నిదర్శనమే గత 8 సంవత్సరాలుగా ప్రజల చేత ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంకుశ గవర్నర్ గిరీ ద్వారా కేంద్ర ప్రభుత్వం అప్ప్రజాస్వామియుతంగా వ్యవహరిస్తోందని వారు ధ్వజమెత్తారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు విఘాతంగా గవర్నర్ లు ప్రవర్తిస్తున్నారని వారు అన్నారు.
కేంద్ర పాలకులకు కీలుబొమ్మలుగా గవర్నర్ లు మారారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వారు ఉద్ఘాటించారు. వాస్తవానికి గవర్నర్ తమ విధులను మరచి, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా విధానపరమైన అంశాలలో తలదూర్చడం, బిల్లులను ఆమోదించక పోవడం చట్ట విరుద్ధమే అని వారు ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, ఆ వ్యవస్థను న్యాయ పరిధిలోని తేవాలని వారు డిమాండ్ చేశారు. రాజ్ భవన్ కు ముట్టడిగా తరలిన నేతలను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి గాంధీ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించి అనంతరం, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో AIYF నేతలు సల్మాన్ బేగ్, రాజ్ కుమార్, రాకేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.