ఉమ్మడి అనంతపురం జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇందుకు ఆ శాఖ డిఐజి మాధవి స్వయంగా రంగంలోకి దిగారు. ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అన్ని పరిణామాలను నిశితంగా పరిశీలించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలుస్తుంది. తన దృష్టికి వచ్చిన అంశాల పట్ల ఇంతవరకు నోటీసులు లేదా సమీక్ష సమావేశాల్లో సబ్ రిజిస్ట్రార్ లకు సూచనలతో కూడిన హెచ్చరికలను జారీ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏమాత్రం మార్పు కనిపించకపోవడంతో ఇక లాభం లేదనుకున్నారో ఏమో నేరుగానే డీఐజీ మాధవి రంగంలోకి దిగాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
కార్యాలయాల్లో పనితీరుపై ఆరోపణలు ఆమె దృష్టికి తరచూ వెళ్ళడం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పద్ధతులు మార్చుకోవాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందికి సూచనలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా కార్యాలయాల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు నేరుగానే అధికారులు సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
వస్తున్న ఫిర్యాదుల్లో చాలావరకు నిజమైనవేనని డీఐజీ ఆకస్మిక తనిఖీలలో బయటపడినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం అనంతపురం రామ్ నగర్ లోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కీలక రికార్డులను పరిశీలించారు… సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. వీటిపై డిఐజి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పెండింగ్ ఫైళ్లు, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు. ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని డి ఐ జి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇష్టం వచ్చినపుడు రావడం, వచ్చినా పనివేళల్లో వారికి కేటాయించిన సీట్లలో కాకుండా ఇతర చోట్ల ఉండటమో, బయటకు వెళ్లిపోవడం జరుగుతున్నట్లు ఆమెకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. చాలామందికి డీఐజీ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పని దొంగలు పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించినట్టు సమాచారం. విధుల పట్ల ఇకపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని ఆమె ఖరాఖండిగా తేల్చి చెప్పారు.