కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు కోపం అన్న చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పని. ఇటు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ కు మధ్య ఆమె నలిగి పోతున్నట్లు తెలుస్తున్నది.
నీలం సాహ్ని ఏపి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏదో ఒక సమస్యతో ఆమె సతమతం అవుతూనే ఉన్నారు. తన సమర్థతతో ఆమె ఎప్పటికప్పుడు సమస్యల నుంచి గట్టెక్కుతున్నా కూడా జరగరానివి జరిగిపోతూనే ఉన్నాయి.
ఇప్పటికే పలుమార్లు కోర్టు మెట్లు…
ప్రభుత్వ విధానాల కారణంగా ఇప్పటికే ఆమె పలుమార్లు హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు ఆమెకు శిరోభారంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల పై ఆమెకు ఎస్ ఇ సికు మధ్య జరుగుతున్న లేఖాయణం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి వత్తిడితో ఆమె ఎస్ ఇ సికె లేఖలు రాస్తున్నారా లేక విషయం పై క్లారిటీ లేక అలాంటి లేఖలు రాస్తున్నారో తెలియడం లేదని ఒక సీనియర్ అధికారే వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నీలం సాహ్ని లేఖ రాసిన తర్వాత మాజీ సీఎస్ ఐ వై ఆర్ కృష్ణారావు స్పందించిన విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, అది పూర్తిగా ఎన్నికల కమిషన్ నిర్ణయానికే వస్తుందని ఐ వై ఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికలు నిర్వహించలేమని నీలం సాహ్నీ లిఖిత పూర్వకంగా చెప్పడం జరిగిపోవడంతో ఇది ఆమెపై మరింత వత్తిడి పెంచింది.
పదవీ విరమణ సమయంలో పెరుగుతన్న వేదన
మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సిఎస్ కు స్థానిక ఎన్నికల నిర్వహణ వివాదం శిరోభారంగా మారింది. సాధారణంగా పదవి విరమణ సమయంలో ప్రశాంతంగా ఉండాలని కోరు కుంటారు అయితే ఆమె పదవి విరమణ చివరి నిమిషం వరకూ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఆరు నెలల కిందటే పదవి విరమణ చేయాల్సిన సాహ్నీకి ప్రభుత్వం మరో ఆరు నెలల సమయం పొడిగించాలని కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఆమెకు డిసెంబర్ నెలాఖరు వరకూ సిఎస్ గా కొనసాగనున్నది. అయితే ఈ కొనసాగింపు సమయంలో వస్తున్న వివాదాలు ఆమెను మనోవేదనకు గురి చేస్తున్నట్లు తెలుస్తున్నది.